బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ బీ-ఫారంతో లోక్సభ బరిలోకి
దానం నాగేందర్ అనర్హత కేసులో కీలకంగా మారిన సికింద్రాబాద్ లోక్సభ పోటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (తెలంగాణ వాణి) రాజకీయంగా మరో పార్టీకి మారడం ఒక అంశమైతే.. అదే సమయంలో తాను గెలిచిన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పదవిని కొనసాగిస్తూ మరో పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం మరో అంశంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంలో సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల ఘట్టం ఇప్పుడు అనర్హత పిటిషన్లో కీలకంగా చర్చకు వచ్చింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2024 మార్చిలో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేశారు. అంటే బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవిని కొనసాగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ బీ-ఫారంతో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు.
ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని దానం నాగేందర్పై అనర్హత చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తదితరులు న్యాయపరమైన పోరాటం కొనసాగించారు. పిటిషన్లలో దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీ-ఫారం తీసుకోవడాన్ని కూడా ప్రస్తావించారు.
స్పీకర్ నిర్ణయం.. ఆ తర్వాత హైకోర్టు
పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సెప్టెంబర్ 18న వెలువరించనున్నట్లు గతంలో ప్రకటించింది.
ఎంపీ కావాలన్న నిర్ణయమే కీలక మలుపా?
దానం నాగేందర్ పార్టీ మారడం మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేయడం అనర్హత కేసులో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆయన పార్టీ మార్పును స్పష్టంగా వ్యక్తం చేశారని పిటిషనర్ల వాదనగా కోర్టు రికార్డుల్లో నమోదైంది.
దీంతో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఎంపీ కావాలన్న రాజకీయ ప్రయత్నం చివరకు ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లో కీలక అంశంగా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
లోక్సభ బరిలోకి దిగిన నిర్ణయం.. పార్టీ ఫిరాయింపు వివాదం.. స్పీకర్ నిర్ణయం.. చివరకు హైకోర్టు తీర్పు—దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానంలో సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికలు కీలక మలుపుగా నిలిచాయి.

