మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి, ఆగస్టు 15 (తెలంగాణ వాణి ప్రతినిధి) మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ పట్లోళ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ కౌడిపల్లి గోపాల్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు.
పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన మన్నేశారికకు రూ.3,000, ద్వితీయ స్థానంలో నిలిచిన షాలోమి ముత్యాలకు రూ.2,000, తృతీయ స్థానంలో నిలిచిన చింతల మాధవికి రూ.1,000 నగదు బహుమతులను అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పట్లోళ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ కౌడిపల్లి గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భుజంపేట గ్రామం అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సునీత, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, యూనియన్ అధ్యక్షులు, మహిళా సంఘం అధ్యక్షురాలు, యువజన సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


