ధర్మారం, ఆగస్ట్ (తెలంగాణ వాణి) పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై బిజెపి నాయకులు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు సరైనవి కాదని మరోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ధర్మారం మండల కేంద్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు నియోజకవర్గం తో పాటు, ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో స్థానిక మంత్రితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పథకం రూపొందించారని తెలిపారు. ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి నేరెళ్లలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కొరకు పరిశీలించారని, ధర్మపురిలో నవోదయ విద్యాలయాన్ని నెలకొల్పాలనికేంద్ర మంత్రి కోరగా దానిని నిజామాబాద్ ఎంపీ అరవింద్ జగిత్యాల కు తరలించారని తెలిపారు. కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధికి 50 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిజెపి నాయకుల పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎలిగేటి మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ వడ్నాల శంకరయ్య, వార్డు సభ్యులు దేవి కిషోర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవి లావణ్య, పొన్నం కృష్ణ, మేకల కుమార్, తాళ్లపల్లి తిరుపతి, కానుగుల తిరుపతి, భూక్య రాజేశం నాయక్, వెంకటేష్ లు పాల్గొన్నారు.


