న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.. కల్పనా చౌదరి
పాల్వంచ (తెలంగాణ వాణి) తుక్కుగూడలో జరిగిన ఘటన అత్యంత దుర్మార్గమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొల్లి ఫౌండేషన్ ప్రతినిధి కల్పనా చౌదరి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన ఊకె శిరీష కుటుంబాన్ని ఆమె పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కొల్లి ఫౌండేషన్ తరఫున శిరీష కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. న్యాయం జరిగే వరకు ఫౌండేషన్ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలని కల్పనా చౌదరి పిలుపునిచ్చారు. శిరీష ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


