ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : -సర్పంచ్ సూర రజిత
ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిఫాం,షూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సూర రజిత హాజరై మాట్లాడుతూ.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూలు అందిస్తోందని అన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని, ఇక్కడే నాణ్యమైన విద్య అందుతుందని ఆమె తెలిపారు. అనంతరం పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణ వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రీ-ప్రైమరీ చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైరి సురేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ పెరక రమ, ప్రధానోపాధ్యాయులు వంశీ మోహనాచార్యులు, ఉపాధ్యాయులు సంపత్, లక్ష్మణ్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.



