ఎన్నికలు జరిగే వరకు అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి
బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం డిమాండ్
కొత్తగూడెం, సెప్టెంబర్ 15 (తెలంగాణ వాణి):
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తదుపరి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించే వరకు జేబీసీసీఐలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని కార్మిక సంఘాలకు కోల్ ఇండియా తరహాలో సమాన అవకాశాలు, సమాన హోదా కల్పించాలని బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు మంగళవారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జీఎం పర్సనల్ (ఐఆర్ అండ్ పీఎం)కు సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏబీకేఎంఎస్ జాతీయ కార్యదర్శి పి. మాధవ నాయక్ మాట్లాడుతూ.. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన అనంతరం కూడా ఏదైనా ఒక సంఘానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం సముచితం కాదన్నారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంలో జేబీసీసీఐలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని సంఘాలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.
కోల్ ఇండియాలో అమలవుతున్న విధానాన్ని సింగరేణిలోనూ అమలు చేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే వరకు జేబీసీసీఐలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని సంఘాలను అధికారిక సమావేశాలు, చర్చలు, భద్రత, సంక్షేమం, సీపీఆర్ఎంఎస్-ఎన్ఈ తదితర కార్మిక సంక్షేమానికి సంబంధించిన సమావేశాలకు సమానంగా ఆహ్వానించాలని కోరారు.
గుర్తింపు సంఘం పదవీకాలం ముగిసిన తర్వాత కార్మికుల సమస్యలపై మాట్లాడే హక్కు ఒక్క సంఘానికే పరిమితం కాకూడదని మాధవ నాయక్ అన్నారు. జేబీసీసీఐలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి సంఘానికి కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యంతో చర్చించే సమాన అవకాశం ఉండాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఎన్నికలు జరిగే వరకు ఇటువంటి విధానాన్ని అనుసరించినందున అదే ప్రజాస్వామ్య పద్ధతిని వెంటనే అమలు చేయాలని కోరారు.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, కార్మికుల సంక్షేమం, భద్రత, వైద్య సదుపాయాలు, పెన్షన్ తదితర అంశాలపై బీఎంఎస్ నిరంతరం కార్మికుల పక్షాన పోరాడుతుందని ఆయన తెలిపారు. తదుపరి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే వరకు అన్ని జేబీసీసీఐ సంఘాలను సమానంగా పరిగణించి అధికారిక చర్చల్లో భాగస్వాములను చేయడం న్యాయసమ్మతమైన నిర్ణయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ జి.వి. కృష్ణారెడ్డి, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ టి.ఎస్. పవన్ కుమార్, కార్పొరేట్ ఉపాధ్యక్షులు బి. రామ్సింగ్, కార్పొరేట్ యూనియన్ నాయకులు అశోక్ కుమార్, బాలకృష్ణ, ఠాగూర్, విద్యానాథ్, లవయ్య, ఫణీందర్ తదితరులు పాల్గొన్నారు.




