UPDATES  

NEWS

 ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష ఖరారు

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు చనిపోవటంతో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. మొత్తం ఎనిమిది మందిని దోషులుగా నిర్థారించిన కోర్టు సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగానే ప్రణయ్ ను హత్య చేసినట్లు నిర్థారించింది. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను హత్య చేయించినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ మార్చి 10న తీర్పునిచ్చింది. మిగతా నిందితులు A1 మారుతీ రావు ఆత్మహత్య చేసుకోగా A3 అస్గర్ ,A4 భారీ, A5 కరీం, A6 శ్రావణ్, A 7 శివ ,A8 నిజాం జీవిత ఖైదీ నిందితులకు జీవిత ఖైదు విధించింది. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ని హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600 పేజీల్లో చార్జ్​షీట్‌ను రూపొందించింది. మొత్తం 78 మంది సాక్షులను విచారించారు. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్థారించారు. 2019 జూన్‌12న చార్జ్​షీట్‌ దాఖలు చేశారు. దానిపై ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు ఐదు సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీస్‌ శాఖ సమర్పించిన చార్జ్​షీట్‌, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లతోపాటు సాక్షులను న్యాయస్థానం విచారించి మార్చి 10న తుది తీర్పునిచ్చింది. ప్రణయ్‌ హత్యకేసులో ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ2 బిహార్‌కు చెందిన సుభాష్‌ శర్మ, ఏ3 అజ్గర్‌అలీ, ఏ4 అబ్ధుల్‌బారీ, ఏ5 ఎంఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌ కుమార్‌, ఏ7 శివ, ఏ8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్​షీట్‌లో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మారుతీ రావు(ఏ-1) 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సుభాష్‌ శర్మ (ఏ-2), అస్గర్‌ అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest