పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ -జేఏసీ డిమాండ్
కొత్తగూడెం ( తెలంగాణ వాణి) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ – జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మహాధర్నాకు సంబంధించిన నోటీసును అందజేశారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున చెల్లించాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీఈ – జేఏసీ జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య, యుటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, పెన్షనర్ల సంఘం నాయకులు వేస్లీ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు రామ్ రవి తదితరులు పాల్గొన్నారు.



