ఎనిమిది మంది భక్తులను బలి తీసుకున్న రెడీమిక్స్ ట్యాంకర్.
కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.
కర్నూల్ (తెలంగాణ వాణి) మంత్రాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బోలేరో గూడ్స్ వాహనం ట్యాంకరు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురు బాధితులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురు ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు, బోలేరో గూడ్స్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతుల్లో నలుగురు మహిళలు, మూడు సంవత్సరాల బాలిక, డ్రైవర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులందరూ కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా తరికిరీ తాలూకా ఉదయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న మంత్రాలయం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
