వేములవాడ,ఏప్రిల్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి) :
వేములవాడ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఉదయం నుంచే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, న్యాయవాదులు,సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహానీయుడికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వేములవాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు,సీనియర్ న్యాయవాది గొంటి శంకర్, తెలంగాణ వాణి వేములవాడ నియోజకవర్గ ప్రతినిధి గొంటి గణేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా గొంటి శంకర్ మాట్లాడుతూ,భారతదేశానికి ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను ప్రజల జీవితాల్లో నాటిన గొప్ప దార్శనికుడు అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని,ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు.
అలాగే గొంటి గణేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక గొప్ప మేధావి మాత్రమే కాకుండా సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడిన యోధుడని అన్నారు. రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించిన హక్కుల వల్లే నేడు ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. యువత అంబేద్కర్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.


