కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం కార్పొరేషన్ ముసుగులో మద్యం దందాకు తెరలేపారని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్ అయితే అభివృద్ధి జరుగుతుందని పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికారని, కాని ఆవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు. కార్పొరేషన్ పరిధిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడెం పట్టణంలో రెండు లిక్కర్ మార్ట్ షాపులను,పాల్వంచ పట్టణంలో ఒకటి లిక్కర్ మార్ట్ షాపులను ప్రారంభించారన్నారు. సుజాతనగర్ లో జాతీయ ప్రధాన రహదారి పక్కన నాలుగు వైన్ షాపులను ఏర్పాటుచేసి యదేచ్ఛగా మద్యం దందాకు తెరలేపారని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఏర్పాటు అయితే నాలుగు పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే పరిశ్రమలు రాకుండా వైన్ షాపులు, లిక్కర్ మార్ట్ లు వచ్చాయని దెప్పిపొడిచారు. కార్పొరేషన్ ముసుగులో విచ్చలవిడిగా మద్యం అందుబాటులోకి రావడం వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని, అభివృద్ధి అంటే మద్యం అమ్మకాలు కాదని, ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు, నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవికుమార్, గజ్జల శంకర్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
