ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో వివి రాంజీ పథకం ద్వారా పంట కుంట పనులను సోమవారం స్థానిక సర్పంచ్ మూల మంగ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ పంట పొలాల్లో వర్షపు నీటిని నిలువ చేసుకోవడానికి, భూగర్భ జలాలను పెంచడానికి, వేసవిలో సాగునీటి కొరతను అధిగమించడానికి పంట కుంటలు నిర్మించుకోవడం ఎంతో ప్రయోజనకరమని సర్పంచ్ మంగ తెలిపారు. వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని నిల్వ చేసుకునేందుకు రైతులు పంట కుంటలను నిర్మించుకోవాలని సూచించారు. పంట కుంటల నిర్మాణంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో రైతులు ఎలాంటి ఖర్చు లేకుండా పంట కుంటలను ఉపాధి హామీ కూలీలతో నిర్మించుకోవచ్చని మంగ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శైలజరాణి, ఈసీ మల్లయ్య, టిఏ ఎం డి హుస్సేన్, మేటు కోట మహేందర్ తో పాటు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.



