21న హైద్రాబాద్లో రాష్ట్ర స్థాయి తెలంగాణ విలీన దినోత్సవ సభ
సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి)
కొత్తగూడెం నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాల వైపు నడిపించి తెలంగాణకు విముక్తి కలిగించి విశాల భారతంలో విలీనం చేసిన నాటి కమ్యూనిస్టు పోరాట యోధులు, అమరవీరులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 11 నుంచి 17వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నుంచి మంగళవారం గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ నిజాం రాచరిక పాలనలో వెట్టిచాకిరి, అంటరానితనం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, కటిక దారిద్ర్యం హైద్రాబాద్ రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ఆంధ్ర మహాసభ సంఘటిత ఉద్యమాలకు పిలుపునిచ్చి నిజాం రాచరిక వ్యస్థను కూల్చివేయడం జరిగిందన్నారు. ఈ మహోద్యమంలో ఎందరో కమ్యూనిస్టులు, ఉద్యమకారులు నేలకొరిగారని వారి త్యాగాలను నేటితరానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. నాడు రైతాంగ పోరాటంలో పంచిన భూముల్లో నేడు మాజీ సీఎం కేసీఆర్ మూడో వంతు కూడా పంచలేదని విమర్శించారు. కొంత మంది అవకాశవాదులు పోరాటాన్ని తామే చేసినట్లుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సాయుధ పోరాటానికి తామే వారసులమంటూ బిజెపి నాయకులు రాజకీయంగా లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ విముక్తికోసం త్యాగాలు చేసిందేవరో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17వరకు గ్రామ గ్రామాన ఉత్సవాలు నిర్వహించి సభలు, సమావేశాలు, జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టి నాటి కమ్యూనిస్టుల స్పూర్తిని చాటాలని, సెప్టెంబర్ 21న హైద్రాబాద్లో జరిగే తెలంగాణ విలీన దినోత్సవ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.