జర్నలిస్టులపై ఇంటలిజెన్స్ పోలీసులతో విచారణ
జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై మంత్రి పొంగులేటికి ఫిర్యాదు
హైదరాబాద్ (తెలంగాణ వాణి) జర్నలిస్టులపై ఇంటలిజెన్స్ పోలీసులతో విచారణ చేయిస్తున్న జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ నేతృత్వంలో కలిసిన బృందం జర్నలిస్టులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న కలెక్టర్ ఆగడాలను మంత్రి దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్లారు. గతంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో సైతం కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, రిపోర్టర్లకు జిఓ 252 కు వ్యతిరేకంగా స్థానం కల్పించడం వివాదాస్పదంగా మారిన విషయాన్ని సైతం మంత్రికి వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 288 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ కాగా అందులో 180 మంది జర్నలిస్టులను ప్రత్యేకంగా గుర్తించి వారిపై ఇంటలిజెన్స్ పోలీస్ అధికారుల చేత విచారణ చేయిస్తున్న కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల వాహనాలను సైతం కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించకుండా ఆదేశాలు జారీ చేసి అమలుపరుస్తున్న విషయాన్ని సైతం మంత్రికి వివరించారు. అదేవిధంగా సూర్య పత్రికతో సహా మరో ఎనిమిది దినపత్రికలను సబ్ కమిటీల నేతృత్వంలో పరిశీలన జరిపి నివేదిక ఇవ్వగా దానికి విరుద్ధంగా మీడియా అకాడమీ చైర్మన్ వ్యవహరిస్తున్న తీరును సైతం మంత్రి దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు తొమ్మిది పత్రికల విషయంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో చర్చిస్తామన్నారు. మంత్రిని కలిసినవారు టియుడబ్ల్యుగా రాష్ట్ర కోశాధికారి యోగానందం, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ నవీన్ కుమార్ యారా, ఐజెయు నాయకులు అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



