విద్యానగర్లో అక్రమ నిర్మాణాలు..
అర్హతలేని ప్రైవేట్ వైద్యశాలలపై చర్యలు తీసుకోవాలి
జలగం యువసేన ఆరోపణ
కొత్తగూడెం, సెప్టెంబర్ 13 (తెలంగాణ వాణి): పట్టణంలోని ఎంజీ రోడ్డు అభివృద్ధిని అధికారులు విస్మరించారని, ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా విద్యానగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జలగం యువసేన ఆరోపించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంజీ రోడ్డులో ఆక్రమణలు, తోపుడు బండ్ల కారణంగా పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన రైతు మార్కెట్ అభివృద్ధి ప్రణాళికను పక్కన పెట్టడం సరైంది కాదని విమర్శించారు. రహదారి విస్తరణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ఆక్రమణల తొలగింపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంత పరిధిలోకి వచ్చే విద్యానగర్ కాలనీలో సరైన అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని జలగం యువసేన ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే స్థానిక వ్యాపార వర్గాలు, ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే పట్టణంలో అర్హతలు, అనుమతులపై స్పష్టత లేని ప్రైవేట్ వైద్యశాలలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ, సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరింది. ప్రజల ఆరోగ్య భద్రతకు భంగం కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైద్య సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరింత చొరవ చూపాలని జలగం యువసేన కోరింది. కమ్యూనిస్టు ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్కు వత్తాసు పలుకుతున్నారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సంస్థ తన ప్రకటనలో విమర్శించింది. ఎంజీ రోడ్డు అభివృద్ధి, విద్యానగర్లో అక్రమ నిర్మాణాలు, ప్రైవేట్ వైద్యశాలల అంశాలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని జలగం యువసేన డిమాండ్ చేసింది.




