శుద్ధీకరణ పేరుతో అంటరానితనాన్ని ప్రోత్సహించడం దురదృష్టకరం: కనకం సాగర్
కరీంనగర్, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి ప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో దళిత దండోరా కార్యక్రమం అనంతరం రోడ్లు, పరిసరాలను పసుపు, తులసి నీటితో శుద్ధి చేసినట్లు వచ్చిన వార్తలు దళితుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని కరీంనగర్ డీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కనకం విద్యాసాగర్ అన్నారు.
టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మంగళవారం ఎర్రవల్లిలో నిర్వహించిన డప్పుల దండోరా విజయవంతమైందని బుధవారం తెలిపారు. దళితులు ఒక ప్రాంతానికి వచ్చినందుకు శుద్ధీకరణ చేయడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అవమానించడమేనని, సమాజంలో మాసిపోయిన అంటరానితనాన్ని ఇలాంటి చర్యలు ప్రోత్సహిస్తాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన విషయాన్ని కేసీఆర్ మరచిపోవద్దని అన్నారు. దళితుల సమస్యలపై నిరసన తెలిపే హక్కు వారికి లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి తానే సీఎం అయ్యారని, అనంతరం దళిత ఉపముఖ్యమంత్రిని తొలగించిన చరిత్ర కేసీఆర్దేనని విమర్శించారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి దళితులపై ప్రేమను చాటుకున్నట్లు చెప్పుకున్నప్పటికీ, తాజా శుద్ధీకరణ ఘటనతో ఆ ప్రేమలోని వాస్తవం బయటపడిందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ఇలాంటి ఘటనలపై స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లోని దళిత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ ఘటనపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై అవమానాలు, వివక్షకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా దళిత, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. శుద్ధీకరణకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కనకం సాగర్ డిమాండ్ చేశారు.




