హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుతం చేసిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఇటీవల ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు, ఆటగాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ తెలంగాణ అథ్లెట్ దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్-2 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమెకు రూ.1 కోటి నగదు బహుమతి సైతం ప్రకటించారు రేవంత్. దాంతో పాటుగా వరంగల్ లో 500 గజాల స్థలం ఇస్తామన్నారు. దీప్తి జీవాంజికి శిక్షణ ఇచ్చిన ఆమె కోచ్ రమేష్ కు రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పారాలింపిక్స్ లో పాల్గొనే వారికి మెరుగైన కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.