వేములవాడలో ఓటర్ల ‘సర్’ ప్రక్రియ విచారణ షెడ్యూల్ విడుదల చేసిన ఆర్డీఓ
నోటీసులు పొందిన ఓటర్లు విచారణ కేంద్రాలకు హాజరు కావాలి: ఆర్డీఓ కే.ఎస్.బి. కుమారి
ఓటు హక్కు పరిరక్షణకు ‘సర్’ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలి: అఖిలపక్ష సమావేశం
పోలింగ్ స్టేషన్ల వారీగా విచారణ తేదీలు ఖరారు.. పారదర్శకతకు సర్వత్రా సహకరించాలి
వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమీక్షా సమావేశం

వేములవాడ, సెప్టెంబర్ 09 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ విచారణ తేదీలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారీ షెడ్యూల్ను ఆర్డీఓ కే.ఎస్.బి. కుమారి విడుదల చేశారు. బుధవారం సాయంత్రం ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె ఈ షెడ్యూల్ను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, నోటీసులు పొందిన ఓటర్లు తమకు కేటాయించిన తేదీ మరియు సమయానికి విచారణ కేంద్రానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించి తమ అమూల్యమైన ఓటు హక్కును భద్రపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ‘సర్’ ప్రక్రియను పారదర్శకంగా, పటిష్టంగా మరియు విజయవంతంగా పూర్తి చేయడానికి బిఎల్ఓలు, బిఎల్ఏలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు పొలాస నరేందర్, మైలారం రాము, పిన్నింటి హన్మాండ్లు, చింతలకోటి రామస్వామి గౌడ్, ఎన్నికల విభాగం సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.




