కోనరావుపేట మండలంలో మూలవాగు ఉధృతికి తెగిన రహదారి
మామిడిపల్లి-నిజామాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు

కోనరావుపేట,జూలై 30 (తెలంగాణ వాణి) :సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వర్షాల ధాటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలకు మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు నీటి ఉధృతికి మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాల మధ్య ఉన్న రహదారి పూర్తిగా తెగిపోయింది. రహదారి కొట్టుకుపోవడంతో ఆయా గ్రామాల నడుమ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, రాకపోకలు స్తంభించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. కాగా, తెగిపోయిన రహదారి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ను అడ్డుగా ఉంచి ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు.