జూలూరుపాడు వైన్ షాపు యజమానుల ‘బెల్ట్’ దందా
సిండికేట్ ఏర్పాటుకు అంతా సిద్ధం
జూలూరుపాడు (తెలంగాణ వాణి) మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో 2 మద్యం షాపులు ఉండగ మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి మరోమారు మద్యం ప్రియులపై భారం మోపనున్నారు.
మందుబాబుల పైనే భారం అంతా
గల్లీ గల్లీకి బెల్ట్ షావు పెట్టేలా పల్లెల్లో తమ వారిని ప్రోత్సహిస్తు రాబోయే రెండేళ్లలో భారీ సంపాదన ధ్యేయంగా సిండికేట్ ద్వారా వసూల్ చేయాలని మద్యం మాఫియా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే బెల్ట్ షాప్ లకు అనధికార లైసెన్స్ ఇవ్వడం ద్వారా కూడా లక్షలాది రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. క్వాటర్ పై 20 రూపాయలు, బీరు పై 25 రూపాయలు అదనంగా పెంచడం ద్వారా తమ ఆదాయం పెంచుకునేలా సిండికేట్ భావిస్తున్నట్లు సమాచారం. అధిక ధరలకు కొనుగోలు చేసిన బెల్టు షాపుల వారు మరో 20 రూపాయలు పెంచితే ఏకంగా గ్రామాల్లో MRP కన్నా క్వాటర్ బాటిల్ పై 40, బీరు బాటిల్ 45 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. మందుబాబులు గ్రామాల్లో విధిలేని పరిస్థితుల్లో పెరిగిన ధరను పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అధికారులు ఏమి చేస్తున్నట్లు..?
బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు చేస్తే అధికారులు ఏమి చేస్తారనే సందేహం ప్రజల్లో కలుగుతుంది. గ్రామాల్లో బెల్ట్ తోలు తీయడానికి ఎక్సైజ్, పోలీస్ అధికారుల పాత్ర గణనీయంగా ఉండాలి. కానీ ఇక్కడ బెల్ట్ షాప్ ల జోలికి వెళ్లకుండా ఇక్కడ సిండికేట్ యంత్రాంగం ఇప్పటికే పోలీస్, ఎక్సైజ్ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
