విద్యార్థి చేయి విరిగిన ఘటనపై వార్డెన్ గోప్యత.!
నర్సంపేట (తెలంగాణ వాణి ప్రతినిది) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ బీసీ వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి చేయి విరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి విద్యార్థులు కింది తరగతి విద్యార్థులపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ర్యాగింగ్కు పాల్పడుతుండటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. గత ఆదివారం పదవ తరగతి విద్యార్థులు జరిపిన దాడిలో తొమ్మిదో తరగతికి చెందిన గణేష్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా, అతని చేయి విరిగింది. ఈ ఘటన బయటకు పొక్కకుండా ఉండేందుకు హాస్టల్ వార్డెన్ భాస్కరరావు అత్యంత గోప్యతను పాటించారు. గాయపడిన విద్యార్థిని గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించిన వార్డెన్, ఆ తర్వాత అసలు విషయం ఎవరికీ చెప్పవద్దని బాధితుడిని భయపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులు అడిగితే కాలుజారి కింద పడ్డానని అబద్ధం చెప్పాలని విద్యార్థిపై ఒత్తిడి తెచ్చి, ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం. స్థానిక స్పెషల్ ఆఫీసర్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే హాస్టల్లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన వార్డెన్ భాస్కరరావుపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.