పండుగ పూట ఉపాధ్యాయుల ఇబ్బందులు
సిద్దిపేట/హుస్నాబాద్: (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలో నివసిస్తున్న జీవో 317 ప్రభుత్వ ఉపాధ్యాలను హుస్నాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. జీవో 317 ద్వారా బదిలీకాని ఉద్యోగులందరినీ స్థానికత ఆధారంగా బదిలీ చేయాలనే డిమాండ్తో వారు శనివారం హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జీవో 317 ద్వారా ‘డిస్లొకేట్’ అయి బాధితులు అయిన ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బూట్ల రాజామల్లయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 బాధితులందరినీ ఒకే రకంగా చూడడం సరికాదని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం జీవో 190 విడుదల చేసినప్పటికీ, ముందస్తు అరెస్టులు చేయడంలో అర్థం లేదని రాజామల్లయ్య ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు చేయడం పోలీసులు మానుకోవాలని ఆయన సూచించారు. అరెస్టైన వారిలో ఉపాధ్యాయులు కక్కెర్ల రవీందర్, కాయిత శ్రీనివాస్ రెడ్డి అయిల బాలకిషన్ లు ఉన్నారు. ఈ అరెస్టుల కారణంగా పండుగ పూట ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.