త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు..మొదట హైదరాబాద్ లో..ఆ తర్వాత పెద్ద సిటీల్లో..

రాష్ట్రంలో త్వరలోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఎలక్ట్రిక్ ఆటోల తయారీ కంపెనీలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆటోలు రోడ్డెక్కనున్నాయి. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతోంది. బస్సుల్లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు బస్ టికెట్తో పాటు ఆటో టికెట్ కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణికుడు ఉన్న ప్రాంతం నుంచి సమీపంలోని బస్ పాయింట్ వరకు ఈ ఆటో తీసుకెళ్తుంది. అలాగే బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లాల్సిన గమ్యస్థానానికి చేరుస్తుంది. దీంతో బస్సు ప్రయాణం మరింత ఈజీ కానుంది. మొదటి దశలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఈ సేవలను ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద నగరాల్లో దశలవారీగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థల ఆటో ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆటోలు అందుబాటులోకి వస్తే నగర శివారు ప్రాంతాల ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్చెరు, రాజేంద్రనగర్, ఘట్కేసర్, శామీర్పేట్, శంషాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది. ఆర్టీసీ బస్సులకు కనెక్టివిటీ పెరగడంతో ప్రయాణికులకు సమయం కూడా ఆదా కానుంది.