సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నిలిపివేయాలి.. కొత్తగూడెం కాంగ్రెస్ హెచ్చరిక
కొత్తగూడెం, ఆగస్టు 25 (తెలంగాణ వాణి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తూమ్ చౌదరి సీపీఐ వైపు చూస్తున్నారంటూ కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం, నిరాధారమైనదని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం తరఫున పూణెం శ్రీనివాస్, ఎండి గౌస్ పాషా ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు తూమ్ చౌదరి గౌరవ, మర్యాద, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే ఉద్దేశంతో కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలను తెరపైకి తెస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తూమ్ చౌదరికి ఉన్న అనుబంధాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి వదంతులు, అపోహలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం తక్షణమే నిలిపివేయాలని పూణెం శ్రీనివాస్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రచారంలోకి వచ్చిన సంబంధిత వార్తలు, పోస్టులను వెంటనే తొలగించాలని సూచించారు.
లేనిపక్షంలో తప్పుడు వార్తలు, నిరాధార ఆరోపణలను ప్రచారం చేస్తున్న సంబంధిత పత్రికల నిర్వాహకులు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు




