చికెన్ సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తింపు
శంకరపట్నం (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని పాత సినిమా థియేటర్ ఆవరణలోని నీటి గుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు అంబాలపూర్ గ్రామానికి చెందిన రావణవేణి శంకర్ (54)గా స్థానికులు గుర్తించారు. శంకర్ కేశవపట్నంలోని చికెన్ సెంటర్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. శంకర్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.




