డబ్బులు వద్దు.. అభివృద్ధికే మా ఓటు
లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) మూడో విడత స్థానిక ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలంలోని మైలారం గ్రామ ప్రజలు తమకు డబ్బు వద్దని అభివృద్ధి కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు డబ్బులు, మద్యం వద్దని ఎన్నో ఏళ్లుగా తమ భూ సమస్యకు పరిష్కారం దొరకడంలేదని, తమ పంట పొలాలను ముంపు ప్రాంత భూములుగా పరిగణించి రెవిన్యూ రికార్డుల్లోకి ఎక్కించారని కానీ తమ భూములు కిన్నెరసాని ప్రాజెక్టు చాలా దూరంలో ఉన్నాయన్నారు. తమ ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వారికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామని గ్రామ యువత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మా గ్రామ అభివృద్ధి చేసే వారికి, తమ భూ సమస్య పరిష్కారం చేస్తామని బాండ్ పేపర్ రాసిన వారికే వార్డు మెంబర్, సర్పంచ్ ఓట్లను వేస్తాం అంటూ ప్లకార్డు ల ద్వారా ప్రచారం చేస్తూ గ్రామంలో అందరికి ఆదర్శంగా నిలిచారు.

