పచ్చదనం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు
టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ వాణి): వీబీ–జి పథకంలో భాగంగా టేకులపల్లి మండలంలోని బోడు, లచ్చగూడెం గ్రామపంచాయతీల్లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు పొదెం స్వరూప, ఎదుల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. బోడు గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టచెరువు ప్రాంతంలో ఈత, ఖర్జూర మొక్కలను అధికారులు, ప్రజాప్రతినిధులు నాటారు. మొక్కలు నాటిన అనంతరం వాటికి నీరు పోసి సంరక్షణ చర్యలు చేపట్టారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులు సూచించారు. అదేవిధంగా లచ్చగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో 200 పూలు, పండ్ల మొక్కలను నాటారు. కార్యాలయ పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వనమహోత్సవం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దడమే అసలు లక్ష్యమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి పరిసరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాలయం అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎన్. రవికుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కొండపల్లి శ్రీదేవి, ఏపీవోలు, ఈసీలు, పీఎస్లు, టీఏలు, ఎఫ్ఏలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్ఐ, అటవీ శాఖ ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు, పోలీస్ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




