ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల ప్రజలు, యువత నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా మండల వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతుందన్నారు. 31వ తేదీ రాత్రి, మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్,ర్యాస్, స్పీడ్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితోపాటు వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీజే లకు అనుమతి లేదన్నారు. పోలీసు శాఖ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు సమావేశాలు ఈవెంట్లు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని రోడ్లపై కేక్ కటింగ్ లు చేయడం టపాకాయలు వెలిగించడం బైక్ రైసింగ్ లు నిర్వహించడం చట్ట ప్రకారం నేరం అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై తెలిపారు.
