వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం – శ్రీ చంద్రశేఖర్ జీ
ధర్మారం (తెలంగాణ వాణి)
వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ పెద్దపల్లి జిల్లా బౌద్ధిక ప్రముఖ్ తీర్పాటి చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ ఎస్ ధర్మారంశాఖ ఆధ్వర్యంలో స్థానిక వైశ్యభవన్ లో విజయదశమి ఉత్సవం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు, హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత,కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం ,పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు.
ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కామని శ్రీనివాస్,రాజేశం పాల్గొన్నారు.