కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మరియు పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా మూడు దశల పోరాటం చేపట్టాలని నిర్ణయించినట్లు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు తెలిపారు.కేజీబీవీ, యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని, రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ తగిన వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. గతంలో జరిగిన పోరాటాల సమయంలో సర్వీస్ కండిషన్లపై అధికారులు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, గత సంవత్సరం 29 రోజుల సమ్మె అనంతరం ఉపముఖ్యమంత్రి తో జరిగిన చర్చల్లో అంగీకరించిన అంశాలు కూడా ఇప్పటివరకు అమలుకాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా పోరాడితే కక్షసాధింపు చర్యలు తీసుకోవడం సరికాదని హెచ్చరించారు.ఎస్ఓలను ప్రిన్సిపల్స్గా, పీజీసీఆర్టీలను జేఎల్గా, సీఆర్టీ/పీఈటీ/సీఆర్పీలను ఎస్ఏలుగా పరిగణించి కనీస మూల వేతనం చెల్లించాలని, హెల్త్ కార్డులు జారీ చేసి ఆరోగ్య భద్రత కల్పించాలని, కేర్టేకర్లను నియమించి రాత్రి కాపలా డ్యూటీల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు.మూడు దశల పోరాటంలో భాగంగా మార్చి 9న పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు మార్చి 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 20న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా “చలో అసెంబ్లీ” కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.ఈ విషయాన్ని రాష్ట్ర కార్యదర్శి బి రాజుతో పాటు జిల్లా అధ్యక్షుడు బి మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బడ్జెట్ సమావేశాలకుముందే సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డుకు కనీస వేతనాల నిధుల ప్రతిపాదనలు పంపించాలని కోరారు.లేకపోతే సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.