ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వహకులు…
గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం…
ఇళ్లలోనే మద్యం అమ్మకాలు…
రుద్రూర్ (తెలంగాణ వాణి) గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడో, కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నారు.
ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వాహకులు…
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద రెండు ఇండ్లలో, జేయన్సీలో మూడు చోట్ల బెల్టు షాపుల దందా జోరుగా కొనసాగుతోంది. ఈ బెల్టు షాపుల నిర్వాహకులు వైన్స్ నుండి ద్విచక్ర వాహనాలపై మద్యాన్ని తరలిస్తున్నారు. బెల్టు షాపుల్లో మద్యం అధిక ధరలకు విక్రాయిస్తున్నా కూడా బెల్ట్ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. వీరికి వైన్సు నిర్వహకులు కొండంత అండగా ఉంటున్నారు. మీ దగ్గరికి ఎవరూ రారు.. మేము చూసుకుంటాం అని భరోసానిస్తున్నారు. అందుకుగానూ ఒక్కో బీరుపై రూ.10, మద్యం బాటిల్పై రూ.10 నుంచి 30 వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వహకులు వినియోగదారుల నుంచి ఒక్కో సీసాపై రూ.30-50 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువేత్తుతున్నాయి.
ఇళ్లలోనే బెల్టు షాపులు…
ఒకప్పుడు బెల్ట్ షాపులు గ్రామానికి రెండు, మూడు భయంభయంగా నిర్వహించేవారు. కానీ నేడు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అయితే బెల్ట్ షాపులంటే మద్యం దుకాణాల్లా కనిపించవు. ఏకంగా ఇళ్లలోనే చాలావరకు మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఏ రాత్రి వెళ్లినా వీరి వద్ద మద్యం లభిస్తుంది. అడపాదడపా దాడులు చేసే ఆబ్కారీ శాఖ, పోలీసులు మళ్లీ ఇటు వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టారీతిన అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టు షాపులపై చర్యలు తీసుకుంటారా?.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.



