అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలేవి
చాతకొండ ఇసుక అక్రమ రవాణా బాధితురాలికి న్యాయం చేయండి
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బిసి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదానికి గురై జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుంచుపల్లి తండాకు చెందిన అజ్మీరా పద్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా విచ్చల విడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడని విమర్శించారు. గిరిజన మహిళకు ప్రమాదం జరిగి, కాలు ఎముక రెండు చోట్ల విరిగి వారం రోజులు కావస్తున్నా మహిళకు మెరుగైన వైద్యం అందించకుండా అధికార పార్టీ అండదండలతో మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చేతులు దులుపుకోవడం సరైంది కాదన్నారు. జిల్లా కేంద్రంలో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేసి ఎక్కడ పడితే అక్కడ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడటమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన సదరు వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అదేవిధంగా గిరిజన మహిళకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, అంతేకాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా రాములు, శివ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.