సుజాతనగర్, (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామపంచాయతీ పరిధిలోని వేములూరు గ్రామంలో పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులపై అటవీ అధికారులు దాడికి పాల్పడ్డారని, దీనిని బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడ్యా సత్యనారాయణ నాయక్ తీవ్రంగా ఖండించారు.
గత 30 ఏళ్లుగా సాగులో ఉన్న సుమారు 35 హెక్టార్ల పోడు భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో అధికారులు మహిళా రైతులపై దాడి చేశారని, ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలు గాయపడినట్లు పేర్కొన్నారు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసుల భూములు, హక్కులను హరించే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ సహించబోదని, జిల్లాలో ఆదివాసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.
వేములూరు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, పోడు భూముల సర్వే పూర్తి చేసి అర్హులైన గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలను కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే పోడు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


