హుజూరాబాద్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం
టీజెఫ్ రజతోత్సవ వేడుకలకి భారీగా తరలి వెళ్ళాలని తీర్మానం
హుజురాబాద్ (తెలంగాణ వాణి)
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూ డబ్యూ జే -హెచ్ 143 ఐజె యు) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు.
సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నాయకత్వంలో మే 31, 2025న హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజెఫ్) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ బలోపేతం కోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసే ఏకైక సంస్థ టీయూడబ్యూ జే -హెచ్ 143 అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజెఫ్ రజతోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా నుండి భారీ సంఖ్యలో జర్న లిస్టులు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా హుజూరాబాద్లో యూనియన్ నూతన అడ్హాక్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్ గా గూడూరి కొండాల్ రెడ్డి, కో కన్వీనర్ లుగా శ్యామ్, శ్రీనివాస్ లని నియమించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే 15 రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అలానే మే 31,2025న హైదరాబాద్లో జరిగే టీజెఫ్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ లోని పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి బోనాల తిరుమల్, కోశాధికారి జేరీపోతుల సంపత్, సీనియర్ జర్నలిస్టులు మండల యాదగిరి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.