వేములవాడ రూరల్, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి):
వేములవాడ పట్టణ శివారులోని హన్మక్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు రోమాల భూమయ్య పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత అడుగుల ఆనవాళ్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గస్తీ పెంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ఐ వెంకట్రాజం మాట్లాడుతూ, హన్మక్కపల్లి వరకు చిరుత సంచారం ఉన్నందున రూరల్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు సూచించిన జాగ్రత్తలు:
పొలం వద్దకు ఒంటరిగా వెళ్లకూడదు
రాత్రి సమయంలో పొలాలకు వెళ్లకుండా ఉండాలి
పశువులను రాత్రిపూట ఇంటి వద్ద కట్టేయాలి
చిరుత సంచారం గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలి
ప్రజలు భయపడకుండా, కానీ జాగ్రత్తలు పాటిస్తూ అధికారులతో సహకరించాలని సూచించారు.
Post Views: 53



