పోలియో చుక్కలు వేసిన అరగంటలో 3 నెలల బాలుడు మృతి
సంగారెడ్డి / కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) మండల పరిధిలోని భీమ్రా గ్రామానికి చెందిన నడిమి దొడ్డి స్వర్ణలత ఉమాకాంత్ దంపతుల 3నెలల కుమారుడు పోలియో వ్యాక్సిన్ చుక్కలను తీసుకున్న కొద్దిసేపటికే మరణించాడని తల్లితండ్రులు కన్నీటి పర్వతమయ్యారు. బాబు అస్వస్థతకు గురై వాంతులు చేయడం, ఏడవడం ఆగకపోవడం, కళ్ళు తెల్లబారడం, చేతులు-కాళ్లు విలవిలలాడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్టు డాక్టర్ ధ్రువీకరించారని బాలుడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బి నాగమణి, బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి నాగమణిని వివరణ కోరగా పోలియో చుక్కల మందుతో బాలుడి మరణం సంభవించలేదని అన్నారు.ఒక వ్యాక్సిన్ లో 18 మంది చిన్నారులకు చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. బాలుడి తల్లిదండ్రులు గ్రామస్తులు అనుమానించడంతో 3 నెలల బాలుడిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిర్వహించడానికి 108 వాహనంలో బాలుడి మృతదేహాన్ని తరలించారు.