విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్’ (యువికా–26)కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమం శాస్త్ర, సాంకేతిక,ఇంజనీరింగ్,గణిత రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి వేదికగా నిలుస్తోంది.ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఎంపికలో 8వ తరగతి మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్విజ్లు,విజ్ఞాన సదస్సులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గ్రామీణ విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.ఎంపికైన విద్యార్థులకు మే నెలలో 14 రోజులపాటు దేశంలోని ఇస్రో కేంద్రాల్లో శాస్త్ర, సాంకేతిక అంశాలపై రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. ప్రయోగాత్మక ప్రదర్శనలు,నిపుణులతో చర్చలు, అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తారు. ఎంపికైన విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా మార్గదర్శక ఉపాధ్యాయుడి ప్రయాణ ఖర్చులను ఇస్రో భరిస్తుంది.భావి శాస్త్రవేత్తలకు ఇది మంచి అవకాశమని జిల్లా సైన్స్ అధికారి బి. సంపత్ కుమార్ తెలిపారు. జిల్లాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.