హైదరాబాద్ (తెలంగాణ వాణి)
మానేటి మట్టిల పుట్టిన మంచి ముత్యం.నారాయణ పురం టంకసాలలో రూపుదిద్దుకున్న పదహారణాల పల్లెనాణేం. తాడితపీడిత జనపక్షం వహించిన అలుపెరుగని అభ్యుదయ కలం. దొరతనాన్ని,దోపిడీని ఎదిరించిన ధిక్కార గళం.పరిశోధనా రంగాన్ని పరిపుష్టం గావించిన శాస్త్రీయ దృక్కోణం.భాషా శాస్త్రంలో నిరంతర శ్రమకు,పరిశ్రమకు నిదర్శనంగా నిలిచిన నిలువెత్తు సంతకం.సృజన రంగాన సల్పిన అవిరళకృషికి,పట్టుదలకు పెట్టింది పేరుగా నిలబడ్డ నిలువుటద్దం. భారత దేశ సమైక్యత,సమగ్ర తలను సంరక్షించిన భారతీయ సాహిత్యానికి పట్టుగొమ్మ.తెలుగు, హిందీ,ఆంగ్లం,తమిళం,కన్నడం, మలయాళం,బెంగాలీ,అస్సామీ, ఒరియా,గుజరాతీ,పంజాబీ,ఉర్దూ, సంస్కృతం,మరాఠీ పద్నాలుగు భాషల్లో అవలీలగా,అద్భుతంగా ఆదానప్రదానాలు గరిపిన బహు భాషాకోవిదులు.కండ్లు బోయేంత కాటుక పెట్టు కోవద్దంటారు కానీ పద్నాలుగు భాషలు ఒట్టబట్టేంత వరకు వాటి పట్టుబట్టినప్పుడు గ్లకోమాను లెక్క చేయని రేషగొండి మనిషి.అచ్చ తెలుగు భాషైన తెలంగాణ భాషా పదాలు,పద బంధాలు,పలుకు బడులు, జాతీయాలు,సామెతలు,పద వ్యుత్పత్తులు,పద నాదమాధు ర్యాలు,పద రూపాంతరాల గుట్టు విప్పిన భాషాశాస్త్రవేత్త.మానేరు తీరాన మొలిచిన భారతీయ బహు భాషల చెట్టు.ఎందరో ఛాత్రులను చేరదీసిన తల్లికోడి.ఆడంబరాలను దరిచేరనివ్వని ఆదర్శజీవి.అనేకా నేక సాహితీ ప్రక్రియలను ఆకర్షణీ యంగా,ఆలోచనాత్మకంగా పండిం చిన అవిశ్రాంత సాహితీ కృషీవ లుడు.సాహితీ రంగాన సహస్ర శీర్సుడు,సహస్ర బాహురూపా దుడు.అపురూపమైన మానవ జన్మను సార్థకం చేసుకున్న ధన్యజీవి.కవిగా,రచయితగా, పరిశోధకులుగా,బహుభాషా వేత్తగా,మీదు మిక్కిలి మనీషిగా, మనిషిగా,డా.నలిమెల భాస్కర్ గారు భారతీయ సాహిత్యంలో సుప్రసిద్ధులు.
సాహితీ సాగరం లాంటి భాస్కర్ సర్ పుస్తకానికి నేను ముందుమాట రాయాలని,ఆయన కోరిక మాత్రమే కాదు;ఆజ్ఞ కూడా.ఇది నా పాలిట హనుమంతుని ముందర కుప్పి గంతులు వేయడం లాంటిదే అవుతుంది.నేనాయన సాహితీ శిష్యుడను.నాకాయన పితృ సమానులు.ఐనా వారి అనువాద కుండీ నవల గురించి నాలుగు మాటలు రాసే ప్రయత్నం చేస్తాను. ఇందులోని గుణములు వారివి. దోషాలు నావి. “ఛందస్సునే గాక ఆలంకారిక శైలిని సైతము విసర్జించి వర్ణనా చమత్కారము నకు కథ నైపుణికి,పాత్ర చిత్రణకు మాత్రమే ప్రాధాన్యమునొసగిన అభ్యాసము నవలయైనది.ఇది వచన వాఙ్మయ సరస్వతికి శిరోభూషణం.ఈ నవలయే ప్రాచీన మానవుడు ఉబుసుపోకకై నేర్పుగా చెప్పిన కథకు పరిణత రూపము”. అని పింగళి లక్ష్మీకాంతం పేర్కొ న్నారు.
భారతీయ భాషల్లో ముందుగా బెంగాలీలోనే నవలా రచన ప్రారంభమైంది.1864లో బంకించంద్ర ‘దుర్గేశనందిని’ రాశారు.1872లో తెలుగున ‘నవీన ప్రబంధం’గా పేర్కొంటూ,శ్రీరంగరా జ చరిత్రము (సోనాబాయి పరిణయము) నరహరి గోపాల కృష్ణమ శెట్టి వెలువరించారు. శ్రీరంగరాజు,లంబాడి కన్య సోనాబాయిల ప్రేమ,వివాహం ఇందులో ఇతివృత్తం.బాణుని సంస్కృత ‘కాదంబరి’కి దాదాపు అనువాదంగా 1867లో కొక్కొండ వేంకటరత్నం ‘మహాశ్వేత’ నవల రాశారు.గోల్డ్ స్మిత్ ఇంగ్లీషులో రాసిన ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’కు అనుసరణగా 1878లో ‘వచన ప్రబంధం’ అంటూ, రాజశేఖర్ చరిత్ర’ సాంఘిక నవలను కందు కూరి వీరేశలింగం రచించారు.ఈ ప్రక్రియను కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ‘నవల’అని పిలిచారు. సంస్కృతంలో ‘నవాన్ విశేషాన్ లాతిగృహ్ణతీత నవల’ అని పేర్కొన్నారు. ‘కొత్త విశేషాలు కలది’ నవల అని వివరించారు.నవల అనే పదం ఇంగ్లీషులోని నోవెల్ నుంచి వచ్చింది.మరాఠీ,గుజరాతీ,కన్నడ భాషల్లో నవల ‘కాదంబరి’గా, హిందీ,బెంగాలీ భాషల్లో ‘నవన్యాస్’ అని మొదట పిలిచినా ‘ఉపన్యాస్’ అనేది స్థిరపడింది.అనతి కాలంలో నే ఆధునిక భారతీయ సాహిత్యా న్ని పరిపుష్టం చేయడంలో నవల కీలక భూమిక పోషించిందని చెప్పవచ్చు.విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన సువిశాల భారతంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ సాధించడానికి అనువాద నవల ఇతోధికంగానే దోహదం చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.డా.నలిమెల భాస్కర్ గారు భారతీయ భాషల ప్రేమికులు. సాహిత్య ప్రియులు.సమ సమాజ స్వాప్నికులు.తెలుగులో వచనం, గేయం,పాట,పద్యం,వ్యాసం,కథ, శతకం,నానీలు,నవల,నవలిక మొదలుకొని పలు ప్రక్రియలను పెక్కుగా పండించారు.’ముప్పై రోజుల్లో ఫలాన భాషను నేర్చుకుం దాం’ అనే పుస్తకాల ద్వార స్వీయంగా బహు భాషలను నేర్చుకున్నారు.అందలి లోతుపా తులను పట్టుకున్నారు.వాటిలోని సారస్యాన్ని,సౌమనస్యాన్ని గ్రోలడానికి,అందులోని జీవన సారాన్ని పాఠకలోకానికి ఒంప డానికి ‘తెలుగు,కన్నడ,తమిళ, మళయాళ సామెతలు- తులనాత్మక అధ్యయనం’ అను అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. పూర్తి చేశారు.ద్రవిడ భాషల వొడుపువిడుపులు,జీవరసాల సొగసులను పట్టి చూపడానికే తెలుగు,మళయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే పీహెచ్డీ పట్టా పొందారు. ఇలా డా.నలిమెల భాస్కర్ సర్ కావించిన కఠోరమైన బహు భాషల అభ్యసనమే;ఆయన చేసిన అనువాదాలకు ఆయువు పట్టుగా నిలిచిందని భావించవచ్చు.
మొదటగా బెంగాలీ,మరాఠీ, హిందీ,తమిళ,మలయాళ,కన్నడ, ఆంగ్ల మొదలగు భాషల్లో నుంచి తెలుగులోకి నవలలు విరివిగా వచ్చినాయి.1899లో బంకించం ద్రుని ‘కపాలకుండ’లను,1907లో ‘ఆనందమఠము’ను,1908లో ‘కమలాకోమల’ నవలలను జి.వి.ఎస్. దొరస్వామయ్య అనువదించారు. ఇలానే శరత్ చంద్ర,రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరుల ప్రసిద్ధ బెంగాలీ నవలలు తెనింగించబడ్డాయి. హిందీ నుండి ప్రేమ్ చంద్,రాహుల్ సాంకృత్యాయన్,యశ్ పాల్ మొదలగువారి నవలలు,తమిళం నుంచి కన్నా సుబ్రహ్మణ్యం,కె.వి. అయ్యరు నవలలు,మరాఠీ నుండి హరినారాయణ ఆప్టే,మలయాళం నుండి తగళి శివశంకర పిళ్ళై పలువురి నవలలు అనువాదమైనాయి.ఈ అనువాద పరంపర నిరంతరాయంగా కొనసాగుతున్న తరుణంలో సుప్రసిద్ధ మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన “స్మారక శిశిగల్” నవలను డా. నలిమెల భాస్కర్ సర్ 2010లో “స్మారక శిలలు” పేరిట తెలుగులోకి అనువదించారు.ఈ నవలకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది.పి.వి.నరసింహారావు తర్వాత ఈ పురస్కారం పొంది న కరీంనగర్ జిల్లా రచయితల్లో నలిమెల భాస్కర్ గారు రెండో వారు.డా.నలిమెల భాస్కర్ సర్ 1993లో నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథలు,1996లో అద్దంలో గాంధారి మరి పదకొండు కథలు,2021లో చలనాచలనం కథలు,2021లో ఇక్కడి నేల…అక్కడి వాన కవిత్వం,2022లో ద్రౌపది…ఇలా అనేక భాషల నుండి తెలుగులోకి అనువాదాలను విరివిగా వెలువరించారు.అలాగే తెలుగు నుండి తమిళం,ఆంగ్లం,హిందీ మొదలైన భాషల్లోకి తర్జుమా చేశారు.ఈయన అనువాదాలన్ని బహుళ పాఠకాదరణ పొందాయనడానికి నిదర్శనం, అవి పునర్ముద్రణలకు నోచుకోవడమే. అందుకే అనువాద రంగంలో డా. నలిమెల భాస్కర్ గారిది అందెవేసిన చేయి అంటారు పలువురు సాహిత్య విమర్శకులు.
కన్నడంలో సుప్రసిద్ధ కథకుడు, నవలాకారుడు,కన్నడ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నాగ మొగసాలె రాసిన కన్నడ నవలను “కుండి”గా డా.నలిమెల భాస్కర్ గారు తెలుగు చేశారు.ఈ నవలను తొంబయవ దశకంలో చలసాని ప్రసాదరావు సంపాదకత్వం వహించిన ‘చతుర’మాసపత్రికలో అచ్చేశారు.కుండి హాస్య రస ప్రధానమైన సాంఘిక నవల.ఇది వీధిలోని చెత్తను ఎత్తేసే సమస్యా తీవ్రతను గూర్చి చర్చిస్తుంది. సీతాపురం మున్సిపాలిటి, రంగయ్య వీధిలో ఉన్న చెత్త కుండి కేంద్రంగా నవలాకారుడు ఈ కథను చాకచక్యంగా నడిపించారు. ప్రతిరోజు అందరి ఇళ్ళలో చెత్తచెదారం పోగవడం సహజం. వీధివాసులంతా చెత్తనొకచోట వేయడానికి మునిసిపాలిటి ఒక చెత్త కుండిని ఏర్పాటు చేస్తుంది. అది ఉన్న చోట ఉండకుండా పలు చోట్లకు రాత్రికి రాత్రే మారడం ఆశ్చర్యం గొలుపుతుంది. పలుకుబడి ఉన్నోళ్లు పరేషానుకు లోనుగాకుండా;వారికి కావలసిన పనులను రహస్యంగా చక్క బెట్టుకుంటారు.సామాన్యులను ఇబ్బందుల్లోకి తోసేస్తుంటారు.ఆ ఇక్కట్లను తొలగించడానికి కథానాయకుడు ఎలాంటి పాట్లుబడ్డాడో పాఠకున్ని ఆలోచింపజేస్తుంది.ఇందులో బాలన్న కథానాయకుడు.ఈయన జర్నలిస్టు,రచయిత, ఉపన్యాసకుడు.నిరాధారమైన అంశాలను పరిగణనలోకి తీసుకొనని నిఖార్సైన మనిషి. అత్యాధునిక భావజాలికుడు. మెరుగైన సమాజం కోసం పరితపిస్తూ ఉంటాడు.ఎవరినైనా ఏడ్పించడం తేలిక, కానీ నవ్వించడం చాలా కష్టం.ఈ వాస్తవాన్ని మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఇది సాహిత్యానికీ అనువర్తిస్తుంది.రచనల ద్వారా నవ్వించడం ఎంతో కష్టం. రచయితలో అద్భుతమైన శ్రద్ధ ఉంటేనే ఔచిత్యానికి భంగం కలగని రీతిలో ఇలాంటి రచనలు వెలుబడుతాయి.అనువాదకులు డా.నలిమెల భాస్కర్ గారికి నవల మూలభాష కన్నడపై గట్టిపట్టు ఉన్నది;కాబట్టే ఇందులో సముచిత రస పోషణ సాధ్యమైంది. పాఠకుడు ‘కుండి’ని ఆహ్లాదంగా చదువుకొనే విధంగా ఇందులో హాస్యవ్యంగాలను సమ పాళ్ళలో మిళితంచేసి,హాస్యరసాన్ని మొండుగా పండించారు.కుండీ కథ పలు మలుపులు తిరుగుతూ, పఠితునిలో ఉత్కంఠను రేపుతుంది.అనువాదకుని రచనాశైలి పాఠకునిచే నవలను ఆద్యంతం గుక్కతిప్పుకోకుండా చదివించేలా చేస్తుంది.తెలుగులో చక్కని హాస్య నవలాకారులుగా గుర్తింపు పొందిన మొక్కపాటి నరసింహశాస్త్రి,చిలకమర్తి లక్ష్మీనరసింహం,ముళ్ళపూడి వెంకటరమణ,ఆది విష్ణు,గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు,ఎర్రంశెట్టి సాయి,పొత్తూరి విజయలక్ష్మిల హాస్య రచనల సరసన డా. నలిమెల భాస్కర్ సర్ కుండీ హాస్య నవలానువాదాన్ని నిలిపారు. పాఠకునికి ఆనందాన్ని,సంతోషాన్ని పంచేది, ఆయువును పెంచేది హాస్యరసమే.అందుకే ఈ హాస్యరస ప్రధాన రచనలే ఆబాలగోపాలాన్ని అక్షరాల అలరిస్తున్నాయి.
నవలా ప్రక్రియకు సైతం రస సిద్ధాంతాన్ని అనువర్తింప చేయవచ్చుననే విలువైన ప్రతిపాదన చేసిన డా.ముదుగంటి సుజాతారెడ్డి “నవలలో పాశ్చాత్య ప్రక్రియా లక్షణాలున్నాయని చాలామంది చెబుతున్నా, అందులో స్వచ్ఛమైన దేశీయత ప్రభావ ప్రసారం స్పష్టమవుతోందని “తెలుగు నవలానుశీలనం”లో అభిప్రాయపడ్డారు.డా.నలిమెల భాస్కర్ గారు అనువదించిన కుండీలో బొత్తిగ దేశీయ స్థల,కాల పరిస్థితులే గోచరిస్తాయి. సమాజంలో చెత్తలా పేరుకుపోయిన అవినీతి,ఆశ్రిత పక్షపాతం,బంధుప్రీతిని కుండి నవల ఖుల్లంఖుల్లంగా పట్టి చూపుతుంది.లంచగొండితనంతో కుళ్ళి కంపు కొడుతున్న మునిసిపాలిటీ అలక్ష్యపు, నిర్లక్ష్యపు పాలనను చెంగల్రావు పాత్ర ద్వారా,ఒడ్డెక్కే దాక ఓడ మల్లన్న ఒడ్డెక్కినంక బోడ మల్లన్న అనే కౌన్సిలర్ కొండయ్య, సమస్యల సాధనకు పోరాడకుండానే పోజులు కొట్టే సి. మునియప్ప వంటి పాత్రల ద్వారా బరితెగించిన బట్టేబాజి రాజిర్కాల గుట్టువిప్పుతుందీ నవల. సామాజిక స్పృహతో,వాస్తవిక పరిస్థితుల చిత్రీకరణతో,పాఠక లోకంలో కనీసస్థాయి చైతన్యాన్ని సాధించగలిగే ప్రబోధతత్వం కుండీ నవలలో కనబడుతుంది.కుండీని తెనింగించిన డా.నలిమెల భాస్కర్ గారు సాంఘిక ఇతివృత్తాలతో నవలలు రాసి,సమాజాన్ని జాగృతం చేసిన కొమ్మూరి వేణుగోపాలరావు,అచ్యుతవల్లి, ద్వివేదుల విశాలాక్షి,వాసిరెడ్డి సీతాదేవి,ఇచ్ఛాపురం జగన్నాథరావు,ఘండికోట బ్రహ్మాజీరావు,పురాణం సుబ్రహ్మణ్యశర్మ,డా.కేశవరెడ్డి, మాలతీచందూర్,రాజ్యలక్ష్మి, మాదిరెడ్డి సులోచన, రంగనాయకమ్మ,గుడిపాటి వెంకటాచలం,డా.పి.శ్రీదేవి, రావిశాస్త్రి,దాశరథి రంగాచార్య, వట్టికో ఆళ్వారుస్వామి,కొ.కు., గోపీచంద్ ల జాబితాలో చేరుతారు. సాంఘిక సమస్యలను ఎత్తి చూపడంలో,వాటికి పరిష్కార మార్గాలను ఆన్వేషించడంలో నవలాకారుల కృషి అనన్య సామాన్యమేనని చెప్పక తప్పదు.
“చక్కని శైలిలో రాసిన రచనను చదువుతున్న పాఠకుడు అలసిపోడు.శైలే జీవితం.శైలే ఆలోచనకు ప్రాణం”.అన్నాడు సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత ప్లెబేర్. పాత్రోచిత భాషా ప్రయోగంతోనే చక్కని శైలి సాధించబడుతుంది. కాబట్టి డా.నలిమెల భాస్కర్ గారు కన్నడ కుండీ తర్జుమాలో తెలంగాణ భాష,పలుకుబడులు, పద బంధాలు,సామెతలను సమర్థవంతంగా వాడుకున్నారు. వీరి ఆత్మీయత శైలి, పరిపుష్టివంతమైన రచన శిల్పం పాఠకున్ని ఆకట్టుకుంటుంది.ఈ నవలలో శుద్ధమైన వాస్తవికతకు అందమైన కాల్పానికతను జోడించి ఆకర్షణీయంగా చెప్పారు.కుండీలో పెత్తందారుల దాష్టికాన్ని,చెత్త రాజకీయ నాయకుల నైజాన్ని తేటతెల్లం చేశారు.మాదిరాజు రంగారావు ‘నవలా స్వరూప సమలోచనం’లో “వ్యక్తి-సమాజం-చరిత్ర-సంస్కృతి-ఆలోచన-అనుభవం-సమన్వయం-సంఘర్షణ మొదలైన విషయాలపై అవగాహన కలిగించేదే నవల”అని విశ్లేషించారు.వీరు వ్యక్తపరచిన అభిప్రాయాలన్నీ కుండీలో కనబడతాయి.కూతురు గీత చేసుకున్న కులాంతర వివాహాన్ని జీర్ణించుకోని తండ్రి రాఘవేంద్రరావు లాంటి పాత్రలు ఇంకా సమాజంలో తారసపడుతూనే ఉన్నాయి. పరువు హత్యలకు పాల్పడుతూనే ఉన్నాయి.నిజాయితీ లేని గెలుపు ఓటమితో సమానమని ఎరుగని ఇల్లాలు మాలతి,సమాజ క్షేమాన్ని కాంక్షించే సైంటిస్టు డా.శ్రీవాత్సవకు భార్య కావడమనేది కాకతాళీయంగా జరుగవచ్చును అని అనిపిస్తుంది.ఈ నవల సమకాలీన జీవితాలకు ప్రతిబింబం పడుతుంది.ఇందులో జీవిత దృక్పథాలను వివరించి చర్చించిడం వల్ల ఇది పాఠకుల జీవితంపై ఒక స్పష్టమైన దృక్పథాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
పోలీసు శాఖలో నిజాయితీపరులను వేళ్ళ మీద లెక్కించవచ్చంటారు సామాజిక వేత్తలు.ఇందులో నిఖార్సుగా వ్యవహరించే ఎస్సై రామస్వామి పాత్రను ఆదర్శవంతమైన అధికారిగా మలిచిన తీరు ఆలోచనాత్మకంగా ఉంది. సమకాలీన సమాజానికి ఇలాంటి అధికారుల అవసరం ఎంతైనా ఉందని మరోమారు గుర్తుచేశారు రచయిత.సంఘంలోని సగటు జీవితాల ఘర్షణలను, సంఘర్షణలను లోతుగా, విస్తృతంగా చిత్రించించారు. ఇందులో ప్రపంచ బస్తీవాసుల జీవితాలను బొత్తిగా ప్రతిబింబింప చేశారు.రామయ్య వీధిలోని వాస్తవికాలైన జీవిత ఆచారాలను విచారించి,సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ,జనుల ఆచార వ్యవహారాలను చక్కగా అభివ్యక్తీకరించారు.కొందరు వ్యక్తుల జీవితాలను ప్రధానంగా తీసుకొని,సామాజిక జీవితాన్ని స్పృశింపజేసే విధంగా భాస్కర్ గారు నవలీకరించారు. విస్తృతమైన తన జీవితానుభవాల్ని ఈ నవలలో వ్యక్తీకరించారు.”నవల ఇలాగే ఉండాలి-ఇలా ఉండకూడదు.అని చెప్పే నిర్దేశక సూత్రాలు-అదృష్టవశాత్తు నవలలకు లేవు.కాబట్టి నవలను వర్ణనాత్మక సూత్రాలతో మాత్రమే విశ్లేషించవలసి ఉంటుంది”.అంటూ వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘నవలా శిల్పం’లో అభిప్రాయపడ్డారు.అలాగే కుండిలో సకలాంశాల క్రోడీకరణ జరిగిందని చెప్పవచ్చు.
కుండీ నవలలో కథ నింపాదిగా ప్రారంభమై,సాగినకొద్దీ విశాలమౌతూ,పాత్రలనూ, సంఘటనలనూ తనలో కలుపుకున్న తరువాత తన వైశాల్యాన్ని తగ్గించుకుంటూ, వేగాన్ని పెంచుకుంటూ ముందుకు సాగి ప్రశాంత గంభీరంగా ముగుస్తుంది.ఇది సమకాలీన సామాజిక కథకుండే గొప్ప లక్షణం. నవలకు కథ శరీరం వంటిదైతే; కథావస్తువు ప్రాణం.కొంతవరకు కథ రూపానికీ,కథావస్తువు భావజాలానికి సంబంధించిన విషయాలు.ఇందులో వీటి రెంటి మధ్య సమతూకం సరిగ్గా కుదిరింది.అందుకే ఈ నవల బహుళ జనాదరణ పొందుతుందనడం నిస్సందేహం. కథావస్తువును భరిస్తూ,కథను నడిపించేది పాత్రలు.వ్యక్తి ప్రవర్తనకు అతని గుణగణాలు, భౌతిక పరిస్థితులు కారణమన్న సూత్రం ఆధారంగా పాత్రపోషణ జరగటం మంచి పద్ధతి.పాత్ర ఎలా ఉంది? ఏం మాట్లాడింది? ఏం ఆలోచిస్తుంది? అనే ప్రశ్నలు పాత్రపోషణను తెలుపుతాయి. పాత్రల మధ్యన సంభాషణలు కుండీలో ఆకట్టుకునేలా అమరినాయి.కథతో, కథావస్తువుతో,పాత్రలతో విడదీయరాన్ని సంబంధం కలిగిన మరొక అంశం నేపథ్యం.వాస్తవికత మీద ఆధారపడ్డ నవల కుండి కాబట్టి తగిన నేపథ్య చిత్రణను సొంతం చేసుకుంది.నేపథ్యం భౌతికమైనది మాత్రమే కాక భావజాల సంబంధమైనది కూడా. ఇందులో కథాకథనం నాటకీయ దృష్టి కోణంలో జరిగింది.ఇదంతా అనువాదకులకున్న ప్రతిభావ్యుత్పత్తులు,ప్రక్రియపై ఉన్న పట్టు,సమాజాన్ని మేలుకొలుపాలన్న తండ్లాట వల్లనే సాధ్యమైనంది.స్వతంత్ర తెలుగు నవల కన్నా అనువాద నవలలు అధికంగా పాఠకాదరణ పొందిన దాఖలాలు మనకు అనేకంగా కనిపిస్తాయి.1980లో ఎలెక్స్ హేలీ ‘దిరూట్స్’ నవల ‘ఏడుతరాలు’గా తెలుగు పాఠకలోకంలో సంచలనం సృష్టించింది.అలాగే డా.నలిమెల భాస్కర్ గారి తెలుగు సేత కుండి నవల పాఠకాదరణ పొందుతుందని అభిలషిస్తున్నాను.
(70వ జన్మ దినోత్సవం జరుపు కుంటున్న సందర్భంగా డా. నలిమెల భాస్కర్ గారికి శుభాకాంక్షలు.)
కూకట్ల తిరుపతి
కవి, రచయిత, విమర్శకుడు
కరీంనగర్, చేబలుకు : 9949247591