UPDATES  

 మావోయిస్టులపై కేంద్రం గురి

ఢిల్లీ (తెలంగాణ వాణి)

మావోయిస్టులే టార్గెట్‎గా కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ( సోమవారం) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‎లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు.

2026 మార్చి నాటికి నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల కీలక సమీక్ష సమావేశం జరిగింది. ప్రత్యేక సమీక్షకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, సీఎస్‎లు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశం జరిగింది. దేశంలో మావోయిస్టు సమస్యను లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యమని ఇప్పటికే అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశానికి ఒడిశా, పశ్చిమ బంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‎ఘడ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం ఉన్న భద్రత సమస్య నుంచి ఆయా ప్రాంతాలకు విముక్తి కల్పించడం, సమాచార వ్యవస్థను నెలకొల్పడం, ఆయా ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు. కేంద్రం చేపట్టే కార్యక్రమాల వివరాలను రాష్ట్రాలకు ఆయా శాఖల కేంద్ర మంత్రులు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్, సాయుధ బలగాల కార్యాచరణ, బలగాల మోహరింపు వివరాలను ఇంటిలిజెన్స్ అధికారులు అందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest