
బండపల్లి, మార్చి 09 (తెలంగాణ వాణి ప్రతి నిధి):
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒక సామాన్య కుటుంబం తమ గూడును, అందులోని సర్వస్వాన్ని కోల్పోయింది.
ప్రమాద వివరాల్లోకి వెళ్తే…
గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన మంజాల శేఖర్ (తండ్రి లక్ష్మయ్య నాగేశ్వరరావు) నివాసంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఇంట్లోని సామగ్రి, బట్టలు, ధాన్యంతో పాటు ఇతర విలువైన వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది, కానీ ఆ కుటుంబానికి తీరని ఆస్తి నష్టం వాటిల్లింది.
సహాయం కోసం ఎదురుచూపులు:
రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబం, కట్టుబట్టలతో మిగిలి పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కళ్లముందే గూడు కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. “అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డాం, మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి” అని శేఖర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆపత్కాలంలో దాతలు, గ్రామస్తులు మరియు స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
